ప్రతిపక్షం, ఆగస్టు 04: ఇన్-సర్వీస్ టీచర్లకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. పార్లమెంటులో ఈ విషయంపై వివరణ ఇస్తూ, టెట్ అర్హత పొందేందుకు 2028 ఆగస్టు వరకు గడువు ఉందని తెలిపింది.
2025లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తొలుత 2027 ఆగస్టు వరకు గడువు నిర్ణయించగా, అనంతరం దాఖలైన రివ్యూ పిటిషన్లను పరిశీలించిన తర్వాత ఆ గడువును 2028 ఆగస్టు వరకు పొడిగించినట్లు కేంద్రం వెల్లడించింది.
అలాగే, ఉపాధ్యాయులకు టెట్ అర్హత సాధించే అవకాశాలు పెంచేందుకు కొన్ని రాష్ట్రాలు తమ విజ్ఞప్తి మేరకు ఏడాదిలో రెండుసార్లు టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీంతో గడువులోగా టెట్ ఉత్తీర్ణత సాధించని ఇన్-సర్వీస్ టీచర్లు తప్పనిసరిగా పరీక్ష రాసి అర్హత పొందాల్సి ఉంటుంది.

















