ప్రతిపక్షం, ఆగస్టు 14: పసుపు పంటకు మార్కెట్లో డిమాండ్ పెరగడంతో రైతులకు మంచి ధర లభిస్తోంది. గత నాలుగేళ్లలో ఎన్నడూ లేని స్థాయికి పసుపు ధరలు చేరాయి. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో ప్రస్తుతం క్వింటాల్ పసుపు రూ.18 వేల నుంచి రూ.19 వేల వరకు పలుకుతోంది.
ఈ ఏడాది ప్రారంభంలో పసుపు ధరలు క్వింటాల్కు రూ.9,500 నుంచి రూ.14 వేల మధ్య మాత్రమే ఉండేవి. అయితే క్రమంగా డిమాండ్ పెరగడంతో ధరలు భారీగా పుంజుకున్నాయి. ప్రస్తుతం నాణ్యతను బట్టి గరిష్ఠంగా రూ.19 వేల వరకు ధర లభిస్తుండటంతో పసుపు సాగు చేసిన రైతుల్లో ఆశలు పెరిగాయి.
తెలంగాణలో ఏటా సుమారు 9 లక్షల క్వింటాళ్ల పసుపు దిగుబడి వస్తుందని అంచనా. నిజామాబాద్తో పాటు జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి తదితర జిల్లాల్లో పసుపును పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. పంటకు మార్కెట్లో డిమాండ్ కొనసాగితే రానున్న రోజుల్లో ధరలు మరింత మెరుగుపడే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.





























