ప్రతిపక్షం, ఆగస్టు 19, హైదరాబాద్: తెలంగాణలో రైతులకు రుణాలు అందించే విషయంలో బ్యాంకులు మరింత చురుగ్గా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. రైతులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని, అర్హత ఉన్న ప్రతి రైతు వద్దకే బ్యాంకర్లు వెళ్లి సకాలంలో రుణాలు అందించాలని స్పష్టం చేశారు. రైతులకు రుణాలు ఇవ్వడంతోనే తమ బాధ్యత పూర్తయిందని భావించకుండా.. వారి ఆదాయం పెరిగేలా బ్యాంకింగ్ వ్యవస్థ పనిచేయాలని సూచించారు.
స్టేట్ లెవల్ బ్యాంకర్స్ సమావేశంలో బ్యాంకర్లతో మాట్లాడిన భట్టి విక్రమార్క.. వ్యవసాయ రంగానికి అందుతున్న రుణాలు, రైతుల ఆర్థిక పరిస్థితి, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవల విస్తరణ తదితర అంశాలపై సమీక్షించారు. 2026 జూన్ నాటికి రాష్ట్ర వ్యవసాయ రంగానికి రూ.52,337 కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. రైతులకు అవసరమైన సమయంలో రుణాలు అందడంతో పాటు వాటిని సరైన రంగాల్లో వినియోగించుకునేలా బ్యాంకులు సహకరించాలని సూచించారు.
రైతులకు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను ప్రోత్సహించాలని భట్టి విక్రమార్క అన్నారు. డెయిరీ, మత్స్య, ఉద్యానవన, పామాయిల్, ఆహార శుద్ధి రంగాలకు మరింతగా రుణాలు అందించాలని బ్యాంకర్లను ఆదేశించారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లో పెట్టుబడులు పెరిగితే రైతుల ఆదాయాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుందని తెలిపారు.
రుణం తీసుకున్న రైతు తిరిగి చెల్లించలేని పరిస్థితి వస్తే.. కేవలం బకాయి వసూలుపైనే దృష్టి పెట్టకుండా అసలు సమస్య ఏమిటో గుర్తించాలని సూచించారు. రైతు ఆదాయం ఎందుకు తగ్గింది? పంట నష్టమైందా? మార్కెట్ పరిస్థితులు అనుకూలించలేదా? పెట్టుబడి వ్యయం పెరిగిందా? వంటి అంశాలను విశ్లేషించి పరిష్కార మార్గాలను చూపాలని బ్యాంకర్లకు సూచించారు. రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచే విధంగా బ్యాంకింగ్ విధానాలు ఉండాలని స్పష్టం చేశారు.
అదే సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాల విషయంలోనూ బ్యాంకులు సానుకూలంగా వ్యవహరించాలని భట్టి విక్రమార్క అన్నారు. రుణం మంజూరు చేయడమే కాకుండా అవసరమైన సమయంలో నిధులు అందించడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. వ్యాపారులకు రుణాలు ఇచ్చే సమయంలో పూచీకత్తు నిబంధనల పేరుతో అనవసరంగా ఇబ్బందులకు గురిచేయవద్దని సూచించారు.
క్రెడిట్ గ్యారంటీ పథకం కింద రూ.4,463 కోట్ల విలువైన 16,265 ప్రతిపాదనలను ఆమోదించినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు అవసరమైన ఆర్థిక సహకారం అందిస్తే ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని తెలిపారు.
తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యాలను సాధించేందుకు రాష్ట్రానికి ప్రత్యేకమైన బ్యాంకింగ్ రోడ్మ్యాప్ రూపొందించాలని భట్టి విక్రమార్క సూచించారు. 2034 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యానికి అనుగుణంగా బ్యాంకులు తమ వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జనధన్ ఖాతాల్లో 19.13 లక్షల ఖాతాలు ప్రస్తుతం జీరో బ్యాలెన్స్లో ఉన్నాయని తెలిపారు. ఆ ఖాతాలు ఎందుకు క్రియాశీలంగా లేవన్నది పరిశీలించి, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రతి గ్రామానికి బ్యాంకింగ్ సేవలు చేరేలా బిజినెస్ కరస్పాండెంట్లను మరింత క్రియాశీలం చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేకపోవడం వల్ల గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడకుండా డిజిటల్, ప్రత్యక్ష బ్యాంకింగ్ సేవలను విస్తరించాలని సూచించారు.
రాష్ట్ర అవసరాలు, అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ‘క్యూర్, ప్యూర్, రేర్’ విధానాలకు తగిన ప్రత్యేక బ్యాంకింగ్ వ్యూహాలను రూపొందించాలని భట్టి విక్రమార్క సూచించారు. రైతులు, చిన్న వ్యాపారులు, గ్రామీణ ప్రజలు, పారిశ్రామిక రంగానికి అవసరమైన ఆర్థిక సహకారం అందించే విధంగా బ్యాంకులు ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
రైతులకు రుణాలు అందించడం మాత్రమే కాకుండా వారి ఆదాయం పెరగడానికి బ్యాంకింగ్ వ్యవస్థ భాగస్వామిగా మారాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో బ్యాంకుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.





























