ప్రతిపక్షం, ఆగస్టు 08: లోన్ యాప్లు, బ్యాంకుల రికవరీ ఏజెంట్ల వేధింపులకు అడ్డుకట్ట వేసేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయాలు తీసుకుంది. రుణ వసూళ్ల పేరుతో రుణగ్రహీతలను ఇష్టానుసారంగా ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకుండా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
కొత్త నిబంధనల ప్రకారం రుణగ్రహీతలను ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే సంప్రదించాలి. రుణ వసూళ్ల సమయంలో బెదిరింపులు, దూషణలు లేదా వేధింపులకు పాల్పడకూడదని స్పష్టం చేసింది.
అలాగే రుణగ్రహీత ఇంటికి వెళ్లి వసూలు చేయాల్సి వస్తే ముందుగానే సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. రుణ వసూళ్ల కోసం నియమించిన ఏజెంట్లు నిబంధనలు ఉల్లంఘిస్తే అందుకు సంబంధిత బ్యాంకులు, ఆర్థిక సంస్థలదే బాధ్యత అని RBI స్పష్టం చేసింది.
ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. రుణ వసూళ్ల పేరుతో రికవరీ ఏజెంట్ల నుంచి ఎదురవుతున్న వేధింపులకు ఈ మార్గదర్శకాలు అడ్డుకట్ట వేస్తాయని భావిస్తున్నారు.





























