ప్రతిపక్షం, ఆగస్టు 26, హైదరాబాద్: తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి స్పష్టం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, వాటిపై ఆమెను ప్రశ్నించే హక్కు తమకు లేదని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మురళి స్పష్టం చేశారు. పార్టీ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, కాంగ్రెస్లోనే కొనసాగుతామని తేల్చి చెప్పారు. ఇటీవల పార్టీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ముందు తమ వివరణ ఇవ్వాల్సిన అంశాలను ఇప్పటికే స్పష్టంగా చెప్పామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని మురళి పేర్కొన్నారు. ముఖ్యంగా గాంధీ కుటుంబంపై తమకు ఎంతో నమ్మకం ఉందని చెప్పారు. పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాలను పార్టీ పెద్దలు చూసుకుంటారని, తాము అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
సుస్మిత చేసిన వ్యాఖ్యలను తమ కుటుంబ వైఖరిగా చూడవద్దని ఆయన కోరారు. ఆమె అభిప్రాయాలు ఆమె వ్యక్తిగతమైనవేనని, వాటికి తమకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు.





























