ప్రతిపక్షం, ఆగస్టు 08: క్రికెటర్ రిషభ్ పంత్ అర్ధరాత్రి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని ట్యాగ్ చేస్తూ తన సొంత రాష్ట్రంలో ఇల్లు నిర్మించుకునేందుకు భూమి దొరకడం లేదని పంత్ పేర్కొన్నారు.
మూడేళ్లుగా ఉత్తరాఖండ్లో సొంత ఇల్లు కట్టుకునేందుకు భూమి కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటివరకు భూమి లభించలేదని పంత్ తెలిపారు. ప్రభుత్వం భూమి ఇస్తామని గతంలో చెప్పినప్పటికీ అది ఇంకా అందలేదని పేర్కొన్నారు.
భూమిని బహుమతిగా ఇవ్వగలిగితే ఇవ్వాలని, లేదంటే తాను కొనుగోలు చేసేందుకు అనుమతించాలని ముఖ్యమంత్రి ధామీని పంత్ కోరినట్లు తెలుస్తోంది. దీంతో పంత్ చేసిన ఈ విజ్ఞప్తి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
అయితే అర్ధరాత్రి సమయంలో పంత్ ఇలా ట్వీట్ చేయడం, భూమి కోసం నేరుగా ముఖ్యమంత్రిని కోరడం చర్చకు దారితీసింది. కొందరు నెటిజన్లు పంత్ సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయిందా? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం ఆయన నిజంగానే భూమి కోసం విజ్ఞప్తి చేశారా అంటూ ప్రశ్నిస్తున్నారు.





























