ప్రతిపక్షం, ఆగస్టు 19: తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన కొండా సుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ స్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై సుస్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీయగా, కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
సుస్మిత చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఉన్నాయని మల్లు రవి పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి పరిశీలించిన అనంతరం ఆమెపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పార్టీలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఉందని, పార్టీ లక్ష్మణరేఖను ఎవరైనా దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యక్తిగత విమర్శలు, పార్టీ నాయకత్వాన్ని ఇబ్బందులకు గురిచేసే వ్యాఖ్యలను కాంగ్రెస్ సహించదని అన్నారు.
ఇప్పటికే పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలపై కూడా నోటీసులు జారీ చేసిన విషయాన్ని మల్లు రవి గుర్తు చేశారు. పార్టీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరించే వారిపై ఒకే విధమైన చర్యలు ఉంటాయని తెలిపారు.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మల్లు రవి, పార్టీ క్రమశిక్షణను కాపాడడం ప్రతి నాయకుడి బాధ్యత అని పేర్కొన్నారు. సుస్మిత వ్యాఖ్యలపై పార్టీ స్థాయిలో సమీక్ష నిర్వహించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
ఇక సుస్మిత చేసిన ఆరోపణలు, వాటిపై కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకోబోయే నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.





























