ప్రతిపక్షం, జూన్ 13: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన నుంచి వివరణ కోరింది.
కామారెడ్డి కాంగ్రెస్లో షబ్బీర్ అలీ, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య కొనసాగుతున్న వర్గపోరు ఇటీవల మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్తో పాటు కొందరు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారంలోకి వచ్చిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్గా తీసుకుని, పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఆరోపణలపై షోకాజ్ నోటీసు జారీ చేసింది. నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వాలని షబ్బీర్ అలీని ఆదేశించినట్లు సమాచారం. ఈ పరిణామం తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

















