ప్రతిపక్షం, ఆగస్టు 26: హైదరాబాద్లో ఆర్మీ మేజర్ భార్యను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఆమె సోషల్ మీడియా ఖాతాల్లోని ఫొటోలు, వీడియోలను సేకరించిన గుర్తుతెలియని వ్యక్తులు కృత్రిమ మేధ సాంకేతికతను ఉపయోగించి అసభ్యకరంగా మార్ఫింగ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వాటిని వివిధ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ బాధితురాలిని వేధించినట్లు సమాచారం.
మార్ఫింగ్ చేసిన చిత్రాలు, వీడియోలను ఆమె బంధువులు, స్నేహితులు, పరిచయస్తులకు చేరేలా నిందితుడు ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ కంటెంట్ను తొలగించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్కు పాల్పడినట్లు తెలుస్తోంది. సుమారు ఏడాదిన్నర కాలంగా వివిధ సామాజిక మాధ్యమాల్లో 200కు పైగా పోస్టులు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.
ఈ వ్యవహారాన్ని గుర్తించిన బాధితురాలి భర్త స్వయంగా ఆన్లైన్లో ఆధారాలను సేకరించారు. నిందితులు ఉపయోగించిన సామాజిక మాధ్యమ ఖాతాలు, వినియోగదారు పేర్లు, లింకులు, తొలగించిన పోస్టులు, వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలను గుర్తించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేశారు.
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మార్ఫింగ్ చేసిన కంటెంట్ను ఎవరు రూపొందించారు, ఏ ఖాతాల నుంచి వాటిని ప్రచారం చేశారు, ఈ వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తులు ఎవరనే కోణాల్లో డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నారు.
కృత్రిమ మేధ ఆధారిత సాధనాలను ఉపయోగించి వ్యక్తుల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి వేధించడం సైబర్ నేరాల్లో కొత్త సవాలుగా మారుతోంది. ఇలాంటి ఘటనలకు గురైన వారు ఆధారాలను తొలగించకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం, సంబంధిత సామాజిక మాధ్యమ వేదికలకు కూడా సమాచారం ఇవ్వడం ద్వారా దర్యాప్తుకు సహకరించవచ్చు.





























