[t4b-ticker]

ఇలా చేస్తేనే సన్నవడ్లకు రూ.500 బోనస్.. రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు

ప్రతిపక్షం, ఆగస్టు 22: తెలంగాణలో సన్నవడ్లకు క్వింటాకు రూ.500 బోనస్‌ అందించే పథకంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఈ బోనస్‌ పొందాలంటే రైతులు ప్రభుత్వం నిర్దేశించిన ఏడు రకాల సన్న వరి విత్తనాలను మాత్రమే సాగు చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. నిర్దేశిత రకాల విత్తనాలను సాగు చేసిన రైతులకే బోనస్‌ వర్తిస్తుందని తెలిపారు.

అంతేకాకుండా విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు సంబంధిత దుకాణాలకు వెళ్లి తమ వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇందుకోసం ఆధార్‌ కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం, విత్తనాల కొనుగోలు బిల్లును తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 10వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసి పేర్లను నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు.

రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణంలోనే ఆధార్‌, పట్టాదారు పాస్‌పుస్తకం, కొనుగోలు బిల్లుతో వివరాలను నమోదు చేయించుకోవాలి. గడువులోగా పేర్లు నమోదు చేసుకోని వారు బోనస్‌కు సంబంధించిన ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.

ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్న వరి విత్తనాలను సాగు చేయడంతో పాటు, నిర్ణీత గడువులోపు అవసరమైన పత్రాలతో వివరాలను నమోదు చేసుకుంటేనే క్వింటాకు రూ.500 చొప్పున బోనస్‌ పొందే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. రైతులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.

Spread the love

Related News

Latest News