ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్ జగపతి
వివాహ కానుకగా రూ. 41,000 ఆర్థిక సాయం అందజేత.
ప్రతిపక్షం,మొయినాబాద్, ఏప్రిల్ 08: రాజకీయాలు అంటే కేవలం పదవులు మాత్రమే కాదు, ప్రజలకు సేవ చేసే గొప్ప వేదిక అని నిరూపిస్తున్నారు అప్పోజిగూడ – చిలుకూరు 19వ వార్డు కౌన్సిలర్ కల్లెంల జగపతి. మానవత్వమే పరమావధిగా ఆయన ప్రవేశపెట్టిన “తల్లి దీవెన” పథకం ఇప్పుడు నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. ఎన్నికల హామీ.. అక్షరాలా అమలు
ఎన్నికల సమయంలో వార్డులోని ప్రతి నిరుపేద ఆడబిడ్డ వివాహానికి తన వంతుగా రూ. 41,000/- ఆర్థిక సాయం అందజేస్తానని జగపతి హామీ ఇచ్చారు. ఆ మాటను అక్షరాలా అమలు చేస్తూ వార్డు ప్రజల మన్ననలు పొందుతున్నారు. తాజాగా చిలుకూరు గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు దర్గా రాజేందర్ – అమృత దంపతుల కుమార్తె శివాని వివాహం నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న కౌన్సిలర్ జగపతి, వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
మూడవ లబ్ధిదారుగా శివాని కుటుంబం
తన సంకల్పంలో భాగంగా, శివాని కుటుంబ సభ్యులకు రూ. 41,000/- చెక్కును “తల్లి దీవెన” పథకం కింద అందజేశారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో శివాని మూడవ వ్యక్తి కావడం విశేషం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు ఈ సాయం ఎంతో ఆసరాగా నిలిచిందని లబ్ధిదారు కుటుంబ సభ్యులు భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు.

























