మూత్ర పిండాల వ్యాధితో గత కొంత కాలంగా చికిత్స
క్షీణించిన ఆరోగ్య పరిస్థితి
హుటాహుటిన ఏఐజీ హాస్పిటల్కు చేరుకున్న హరీశ్రావు, బీఆర్ఎస్ నేతలు
ప్రతిపక్షం స్టేట్ బ్యూరో, హైదరాబాద్:
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గత కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య పరీక్షలలో కిడ్నీ ఫెయిల్యూర్ నిర్ధారణ కావడంతో పరిస్థితి గురువారం మద్యాహ్నం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తొంది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్రావు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని నియోజకవర్గ ప్రజలు, అభిమానులు ప్రార్థిస్తున్నారు. గోపీనాథ్గచ్చిబౌలిలోని ప్రముఖ ఏఐజీ ఆస్పత్రిలో నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి నిలకడగా లేదనే వార్తలు వెలువడటంతో.. నియోజకవర్గ ప్రజల్లో, బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఆసుపత్రి వద్ద హరీశ్రావు గోపీనాథ్ ఆరోగ్యంపై మీడియాకు సమాచారం వెల్లడించారు. ఆయనకు ఐసీయూలో నిపుణులైన డాక్టర్ల బృందం చికిత్స అందిస్తున్నారని, కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు ఎవరూ ఆందోళనకు గురికావొద్దన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ ఆసుపత్రికి రావోద్దని హరీశ్రావు సూచించారు. మరో పక్క గురువారం రాత్రికి గోపీనాథ్ హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది. మరో 48 గంటలు గడిస్తే తప్ప ఏం చెప్పలేమని వైద్యులు వెల్లడించినట్టు తెలుస్తోంది.