ప్రతిపక్షం, జూన్ 10: తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ నిర్వహించిన దాడుల్లో ఆర్అండ్బీ శాఖ ప్రధాన ఇంజినీర్ మోహన్ నాయక్కు సంబంధించిన భారీ స్థాయిలో అక్రమాస్తులు వెలుగుచూశాయి. స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, భూములు, విలాసవంతమైన ఆస్తుల వివరాలు చూసి అధికారులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.
దాడుల్లో కిలోన్నర బంగారు బిస్కెట్లు, కిలోకు పైగా బంగారు ఆభరణాలు, ఆరు కిలోల వెండి వస్తువులు, బ్యాంకు ఖాతాల్లో రూ.1.50 కోట్ల నగదు, నివాసంలో రూ.55 లక్షల నగదు లభించినట్లు సమాచారం. అంతేకాకుండా 19 ఎకరాల వ్యవసాయ భూమి, ఏడు విలాసవంతమైన ఫ్లాట్లు, విల్లాలు, ఖరీదైన కార్లు, ల్యాప్టాప్లు, కీలక ఆస్తి పత్రాలను అధికారులు గుర్తించారు.
దర్యాప్తులో బయటపడిన ఆస్తుల ప్రాథమిక అంచనా విలువ భారీగా ఉన్నప్పటికీ, ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం వాటి మొత్తం విలువ రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా మరిన్ని ఆస్తులు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది.
అధికారికి తెలిసిన ఆదాయ వనరులతో పోలిస్తే ఈ ఆస్తుల పరిమాణం అసాధారణంగా ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఆస్తుల కొనుగోలు వివరాలు, పెట్టుబడుల మూలాలు, బినామీ లావాదేవీలపై ప్రత్యేక బృందాలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.
ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపగా, అవినీతి ఆరోపణలపై మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

















