ప్రతిపక్షం, జూన్ 17: హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణకు అవసరమైన అనుమతులు, నిధుల విడుదల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) ద్వారా జూన్ 15న విడుదల కావాల్సిన రుణం ఇప్పటికీ విడుదల కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
మెట్రో తొలి దశ స్వాధీన ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1,461 కోట్ల ఈక్విటీ చెల్లించిందని సీఎం పేర్కొన్నారు. IRFC ఆమోదించిన రుణాన్ని తక్షణమే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని, ఈ అంశంపై కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కిషన్ రెడ్డిని కోరారు.
హైదరాబాద్ నగర అభివృద్ధి, ప్రజా రవాణా విస్తరణకు మెట్రో ఫేజ్-2 అత్యంత కీలకమని పేర్కొన్న సీఎం, సమస్య పరిష్కారం కోసం అవసరమైతే వ్యక్తిగతంగా సమావేశమై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు లేఖలో వెల్లడించారు.

















