ప్రతిపక్షం, జూన్ 18: పరిపాలనలో సాంకేతికత వినియోగాన్ని మరింత విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ మంత్రివర్గ వ్యవస్థను ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ విధానానికి ఆమోదం లభించింది.
ఈ సందర్భంగా సమాచార సాంకేతిక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు ప్రత్యేక ట్యాబ్లను అందజేశారు. ఇకపై మంత్రివర్గ సమావేశాలకు సంబంధించిన అజెండా, నివేదికలు, పత్రాలు అన్నీ డిజిటల్ రూపంలోనే అందుబాటులో ఉండనున్నాయి.
కాగిత వినియోగాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటం, పరిపాలనలో పారదర్శకత మరియు వేగాన్ని పెంచడం లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. డిజిటల్ మంత్రివర్గం ద్వారా నిర్ణయాల ప్రక్రియ మరింత సమర్థవంతంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.
















