ప్రతిపక్షం, జూన్ 19: అమెరికాలోని డల్లాస్ నగరంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 4 వరకు నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక జీ20 సావరిన్ వెల్త్ ఫండ్ పెట్టుబడుల వారోత్సవ సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. సదస్సు నిర్వహణ సంస్థ ఛైర్మన్ లక్ష్మీనారాయణన్ ముఖ్యమంత్రిని కలిసి అధికారిక ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడి సంస్థలు, ఆర్థిక నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సు ద్వారా తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
అలాగే మౌలిక వసతులు, సాంకేతికత, పారిశ్రామిక అభివృద్ధి, పట్టణీకరణ వంటి కీలక రంగాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. తెలంగాణను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ సదస్సు కీలకంగా మారనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

















