ప్రతిపక్షం, జూన్ 19: నల్గొండ జిల్లాలోని పెద్దవూర–సాగర్ ప్రధాన రహదారిపై గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ముత్యాలమ్మగూడెం సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, హైదరాబాద్ నుంచి సాగర్ వైపు వెళ్తున్న ఒక కారు, సాగర్ నుంచి వస్తున్న మరో కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఢీకొన్న ప్రభావం తీవ్రంగా ఉండటంతో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన థాంసయ్య (60), ప్రకాశ్రావు (40) అక్కడికక్కడే మృతి చెందగా, మరో కారులో ప్రయాణిస్తున్న సాయికుమార్ (26) కూడా ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన అధికారులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
అర్ధరాత్రి వేళ అధిక వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

















