ప్రతిపక్షం, జూన్ 23: తెలంగాణలో సాంకేతిక, వృత్తిపరమైన డిగ్రీలు అర్హతగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో స్థానికత నిర్ధారణకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటువంటి పోస్టులకు అభ్యర్థులు ఏడో తరగతి వరకు ఎక్కడ చదివారన్న అంశాన్ని ప్రామాణికంగా పరిగణించడం సరైన విధానం కాదని కోర్టు స్పష్టం చేసింది.
ఉద్యోగానికి అర్హతగా నిర్ణయించిన డిగ్రీ లేదా ప్రొఫెషనల్ కోర్సును అభ్యర్థి ఎక్కడ పూర్తి చేశారన్న అంశానికే ప్రాధాన్యం ఇవ్వాలని హైకోర్టు అభిప్రాయపడింది. ఉన్నత విద్యను తెలంగాణలో అభ్యసించిన అభ్యర్థులను, కేవలం పాఠశాల విద్య ఇతర రాష్ట్రాల్లో పూర్తయిందనే కారణంతో నాన్-లోకల్గా పరిగణించడం సమంజసం కాదని పేర్కొంది.
స్థానికత నిర్ధారణలో వాస్తవ పరిస్థితులు, విద్యాభ్యాస నేపథ్యం, అర్హత కోర్సుల ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుంటూ సహేతుకమైన విధానాలను అమలు చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు హైకోర్టు సూచించింది.
ఈ వ్యాఖ్యలు భవిష్యత్ నియామకాలలో స్థానికతకు సంబంధించిన వివాదాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

















