ప్రతిపక్షం, జూన్ 25: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పలు అధికారిక కార్యక్రమాలతో బిజీగా గడపనున్నారు. ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి కర్ణాటకకు బయలుదేరనున్నారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం హైదరాబాద్కు తిరిగి చేరుకోనున్నారు.
ఆ తర్వాత సాయంత్రం రవీంద్రభారతిలో నిర్వహించే ఉద్యోగుల ఆరోగ్య పథక ఒప్పంద కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్య సేవల విస్తరణ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ఆయన ప్రసంగించనున్నట్లు సమాచారం.
ఉద్యోగుల ఆరోగ్య భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా చేపడుతున్న చర్యలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.

















