ప్రతిపక్షం, జూన్ 27: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఏకరీతి విధానం పాటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై లబ్ధిదారులు తమ ఇష్టానుసారం ఇంటి స్లాబ్ నిర్మించకుండా, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారమే నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం ఇళ్ల స్లాబ్ విస్తీర్ణం 500 నుంచి 750 చదరపు అడుగుల మధ్య మాత్రమే ఉండాలి. అలాగే స్లాబ్ ముందువైపు మూడు అడుగులు, మిగతా మూడు వైపులా ఒక్క అడుగు మాత్రమే పొడిగింపు ఉండేలా నిర్మించాల్సి ఉంటుంది.
నిర్మాణ వ్యయాలు అదుపులో ఉండేలా ఈ పరిమితులు విధించినట్లు హౌసింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. ఈ నిబంధనలపై గ్రామ స్థాయిలో లబ్ధిదారులకు పూర్తి అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

















