ప్రతిపక్షం, జూన్ 29: గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్రావులను “బిల్లా–రంగా”తో పోలుస్తూ తీవ్ర విమర్శలు చేశారు.
సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల్లో బీజేపీకి వచ్చిన ఓట్లను పరిశీలిస్తే రెండు పార్టీల మధ్య ఉన్న రాజకీయ అవగాహన స్పష్టంగా కనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బీజేపీ ప్రతిపక్షంగా కాకుండా ప్రేక్షక పాత్రకే పరిమితమైందని ఆరోపించారు.
అలాగే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
















