Trending Now

ప్రజాశాంతి పార్టీలో చేరిన టాలీవుడ్ యాక్టర్..

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన కేఏ పాల్​

వరంగల్​ లోక్​సభ అభ్యర్థిగా బాబుమోహన్​ పోటీ

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: టాలీవుడ్ యాక్టర్, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. సోమవారం అమీర్​పేటలోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఆయనకు కండువా కప్పి కేఏ పాల్ పార్టీలోకి ఆహ్వానించారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఆందోల్‌ నుంచి బరిలోకి దిగారు.. అయితే ఆయన కేవలం 5,524 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి.. దామోదర రాజ నర్సింహ విజయం సాధించారు. గత ఎన్నికల సమయంలో బాబూ మోహన్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నప్పటికీ.. ఆయన తనయుడు ఉదయ్ భాస్కర్ అదే సమయంలో బీఆర్‌ఎస్ కండువా కప్పుకుని.. కారు గుర్తుకు ఓటెయ్యాలని ప్రచారం చేయడం గమనార్హం.

ఇక ఇటీవల కాలంలో బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తోన్న బాబు మోహన్.. ఆ పార్టీకి ఫిబ్రవరి 7 న గుడ్ బై చెప్పారు. వరంగల్ లోక్‌సభ సీటు ఇవ్వమని తేల్చి చెప్పడంతో.. ఆయన కమలం పార్టీని వీడారని ప్రచారం జరిగింది. కాగా బీజేపీని వీడిన సమయంలో ఏ పార్టీలో చేరేది త్వరలో చెబుతానన్నారు. కానీ ఊహించని రీతిలో ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరడం పలువురిని విస్మయానికి గురిచేసింది. కాగా బాబు మోహన్.. ప్రజా శాంతి పార్టీ తరఫున వరంగల్ లోక్‌సభస్థానం నుంచి పోటీ చేస్తారని కేఏ పాల్​ ప్రకటించారు.

Spread the love

Related News