ప్రతిపక్షం, జూలై 03: సింగరేణిలో అక్రమాల ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణిలో ఒక్క కేజీ బొగ్గు కూడా మాయం కాలేదని స్పష్టం చేసిన ఆయన, వాస్తవాలు విచారణలోనే బయటపడతాయని అన్నారు.
బీఆర్ఎస్ నేత హరీశ్రావు చేసిన ఆరోపణలను ఖండించిన భట్టి, పదేళ్ల పాలనలో అక్రమాలకు బాధ్యులు ఎవరో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన సరుకులు అందించాలనే ఉద్దేశంతోనే టెండర్లు పిలిచామని తెలిపారు.
రూ.1,142 కోట్ల విలువైన టెండర్లను రూ.2 వేల కోట్ల అవినీతిగా ఎలా పేర్కొంటున్నారని ప్రశ్నించిన ఉప ముఖ్యమంత్రి, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. విచారణ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.

















