ప్రతిపక్షం బ్యూరో, జూలై 04: విక్టోరియా(ఆస్ట్రేలియా) శాసనమండలి ప్రభుత్వ విప్ లీ టార్లామిస్ శనివారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ప్రధానంగా ‘తెలంగాణ – విక్టోరియా’ మధ్య వాణిజ్య, సాంకేతిక సహకారంపై చర్చించారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్, స్టార్టప్ ఎకోసిస్టమ్, విద్య, నైపుణ్యాభివృద్ధి, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్, ఎంటర్ టైన్ మెంట్ తదితర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా… తెలంగాణను ‘గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ డెస్టినేషన్’గా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా రాష్ట్రంలో ఇండస్ట్రియల్ ఎకో సిస్టంను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో… అంతర్జాతీయ భాగస్వామ్యాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ అత్యంత అనుకూలమని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా స్థానిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కోరారు. ‘తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాలతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నాం. ఏయే అంశాల్లో కలిసి పని చేసేందుకు అవకాశాలున్నాయో గుర్తించి… ఆ దిశగా సమగ్ర రోడ్డు మ్యాప్ ను సిద్ధం చేసుకుని ముందుకెళ్తాం’ అని విప్ లీ టార్లామిస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఎస్ సంజయ్ జాజు పాల్గొన్నారు.
















