ప్రతిపక్షం బ్యూరో,నిజామాబాద్, జూలై 04: తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, రైతాంగ ప్రయోజనాలు కాపాడడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) స్పష్టం చేశారు. నిజామాబాద్ నగరంలోని శ్రద్దానంద్ గంజ్ (మార్కెట్ యార్డు)లో రూ. 6.56 కోట్ల నిధులతో చేపడుతున్న షెడ్ల నిర్మాణాలు, మడిగెలు, సోలార్ విద్యుత్ తదితర పనులకు మంత్రి సీతక్క శనివారం నిజామాబాద్ రూరల్ శాసన సభ్యులు డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ ఉమారాణి తదితరులతో కలిసి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి కట్టుబడి పని చేస్తోందని, రాష్ట్రంలో రైతాంగ ప్రభుత్వం కొనసాగుతోందని అన్నారు. అప్పుల భారం వల్ల తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు నెలకొని ఉన్నప్పటికీ రైతులకు పంట రుణాల మాఫీ, రైతు భరోసా, సన్న ధాన్యానికి బోనస్ అందజేయడం జరుగుతోందని గుర్తు చేశారు. రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా యాసంగి సీజన్ లో పెద్ద ఎత్తున పంటలు సాగు చేశారని అన్నారు. ప్రతి పంటకు పూర్తిస్థాయిలో మద్దతు ధర చెల్లిస్తూ, చివరి గింజ వరకు కూడా ప్రభుత్వమే పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకుందని తెలిపారు. పేద కుటుంబాలు కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు. తమకు అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల సంక్షేమాన్ని విస్మరించకుండా, వారి అభివృద్దే ధ్యేయంగా అహరహం శ్రమిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎల్లవేళలా అండదండగా నిలువాలని కోరారు. కాగా, రాష్ట్రంలో పేరెన్నికగన్న నిజామాబాద్ మార్కెట్ యార్డుకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు వీలుగా ముఖ్యమంత్రి, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రితో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. మార్కెట్ యార్డులోని అర్హులైన హమాలీలకు ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూమ్ లు మంజూరు చేసేలా చొరవ చూపుతానని అన్నారు. హమాలీల కోసం ప్రత్యేకంగా బోర్డును ప్రకటించారని, ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీస వేతన చట్టాన్ని ప్రకటించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి, ఎ.ఎం.సీ పాలకవర్గ ప్రతినిధులు, రైతులు, హమాలీలు, గుమాస్తాలు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

















