ప్రతిపక్షం, జూలై 05: నల్గొండ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టడంతో చిన్నారితో సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమవగా, ఘటనా స్థలంలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ట్రావెల్స్ బస్సు వేగం లేదా నిర్లక్ష్య డ్రైవింగ్ కారణమా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. మృతుల వివరాలను సేకరించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఇదిలా ఉండగా, జోగులాంబ గద్వాల జిల్లాలోనూ మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హిందూపూర్ నుంచి హైదరాబాద్కు వస్తున్న మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మానవపాడు స్టేజి సమీపంలోని జాతీయ రహదారిపై ముందువెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో పది మంది గాయపడ్డారు.
గాయపడిన ప్రయాణికులను స్థానికులు, పోలీసులు వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ రెండు ప్రమాదాలపై సంబంధిత పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరుస రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, వాహనదారులు వేగ నియంత్రణతో పాటు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

















