ప్రతిపక్షం, జూలై 07: వర్షాల కారణంగా వాయిదా పడిన రైతు ఆశీర్వాద సభను ఈ నెల 9న నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో సభా ప్రాంగణం, హెలిప్యాడ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ దివాకర, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కలిసి పరిశీలించారు. పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో చర్చించిన అనంతరం సభ నిర్వహణ తేదీపై అధికారిక ప్రకటన విడుదల చేస్తామని కలెక్టర్ తెలిపారు. సభకు భారీ సంఖ్యలో రైతులు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను సమగ్రంగా చేపడుతున్నారు. భద్రత, ట్రాఫిక్, తాగునీరు, పార్కింగ్ తదితర సౌకర్యాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం రేవంత్ రెడ్డి సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
















