ప్రతిపక్షం, జూలై 07: రాష్ట్ర పరిపాలనను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు డిజిటల్ గవర్నెన్స్ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా, పారదర్శకంగా అందేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని, అవసరమైన చోట కొత్త చట్టాలను కూడా తీసుకురావాలని సూచించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు, డిజిటల్ పరిపాలన అమలుపై సీఎం విస్తృతంగా చర్చించారు.
రాష్ట్రంలోని అన్ని శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పూర్తి వివరాలు, వారి జీతభత్యాలు, బ్యాంకు ఖాతా సమాచారం, సేవా వివరాలను డిజిటల్ వ్యవస్థలో నమోదు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రతి నెల ఒకటో తేదీ నుంచి గరిష్టంగా ఐదో తేదీలోపు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు అందేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.
సమీక్ష సందర్భంగా రాష్ట్రంలో సుమారు 4,800 కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయని, వాటిలో దాదాపు 4,300 ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి చట్టబద్ధ ప్రయోజనాలు కల్పించడం లేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైనా ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కార్మికుల హక్కులకు భంగం కలిగించే సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
డిజిటల్ గవర్నెన్స్ అమలుతో జీతాల చెల్లింపులు, ఉద్యోగుల సంక్షేమ పథకాల అమలు, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి అంశాలను పారదర్శకంగా పర్యవేక్షించే అవకాశం ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు కూడా నేరుగా లబ్ధిదారులకు చేరేలా సాంకేతికతను సమర్థంగా వినియోగించాలని సూచించారు.
ఈ అంశాలపై సమగ్ర విధానాన్ని రూపొందించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ కమిటీ 100 రోజుల్లో నివేదిక సమర్పించి, డిజిటల్ గవర్నెన్స్ అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను కూడా పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేసి హెల్త్ కార్డులు, ఇతర సంక్షేమ ప్రయోజనాల అమలును మరింత సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
డిజిటల్ సాంకేతికతను వినియోగించి ప్రభుత్వ సేవల్లో జవాబుదారీతనం, పారదర్శకత, వేగం పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి నిరంతర మానిటరింగ్ నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు, ప్రభుత్వ సలహాదారులు, సంబంధిత శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.


















