ప్రతిపక్షం, జూలై 08: నేపాల్లో ఒక అడవి ఏనుగు ఏకంగా 14 ఏళ్లుగా ఒకే కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ‘ధుర్భే’ అనే ఏనుగు ఈ నెల 4న శనిచారా బోటే ఇంటిపై దాడి చేసి అతని కోడలు, నాలుగేళ్ల మనవడిని చంపేసింది. ఈ విషాద ఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేసింది.
ఆశ్చర్యకరంగా, ఇదే ఏనుగు 2012 డిసెంబర్ 16న శనిచారా బోటే తల్లిదండ్రులపై దాడి చేసి వారిని కూడా బలితీసుకుంది. ఆ ఘటన తర్వాత భయంతో బోటే కుటుంబం తమ పాత ఇంటికి 17 కిలోమీటర్ల దూరంలో మరో ప్రాంతానికి వెళ్లి నివాసం ఏర్పరుచుకున్నప్పటికీ, ఆ కుటుంబాన్ని ఏనుగు వదల్లేదని స్థానికులు చెబుతున్నారు.
గుంపు నుంచి విడిపోయిన ఈ ‘ధుర్భే’ ఏనుగు 2010 నుంచి ఇప్పటివరకు సుమారు 25 మందిని చంపినట్లు సమాచారం. ఈ ఘటనల నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై, ఏనుగు సంచారంపై నిఘా పెంచడంతో పాటు స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
















