ప్రతిపక్షం, జూలై 08: హైదరాబాద్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. సికింద్రాబాద్ సమీపంలో ప్రయాణిస్తున్న రైలులో ఓ ప్రేమ జంట పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనతో రైలులో ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
పోలీసుల వివరాల ప్రకారం, శ్రీకాకుళం జిల్లాలోని చాపర గ్రామానికి చెందిన శిరీష్కుమార్కు సులోచనతో వివాహం జరిగింది. అయితే అదే గ్రామానికి చెందిన వివాహిత నీలవేణితో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఇద్దరూ కలిసి కోయంబత్తూరుకు వెళ్లిపోయారు.
విషయం తెలుసుకున్న శిరీష్కుమార్ భార్య సులోచన వారిని ఒప్పించి హైదరాబాద్కు తీసుకొస్తుండగా, సికింద్రాబాద్ సమీపంలో రైలులోనే శిరీష్కుమార్, నీలవేణి పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు.
వెంటనే అప్రమత్తమైన సహ ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఇద్దరినీ చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


















