ప్రతిపక్షం, జూలై 09: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జూమ్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమీక్షా సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొని పార్టీ నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశానికి రాష్ట్రంలోని ఎంపీలు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, ఎస్ఐఆర్ పార్లమెంట్–అసెంబ్లీ కోఆర్డినేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, సంస్థాగత వ్యవస్థ బలోపేతం, క్షేత్రస్థాయి కార్యకలాపాలపై విస్తృతంగా చర్చిస్తున్నారు.
ముఖ్యంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ పనితీరు, బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏలు) కార్యకలాపాలు, బూత్ల వారీగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాల పురోగతిపై టీపీసీసీ నాయకత్వం సీరియస్గా సమీక్ష నిర్వహిస్తోంది. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు.
రానున్న రాజకీయ, ఎన్నికల కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ యంత్రాంగాన్ని మరింత చురుకుగా పనిచేసేలా చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సూచించినట్లు సమాచారం. బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమీక్షా సమావేశాలు కొనసాగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.


















