- బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడి
- విధేయతకు లభించిన గుర్తింపు
ప్రతిపక్షం, నంగునూరు, జూలై 11: భారతీయ జనతా పార్టీ సిద్ధిపేట జిల్లా కార్యదర్శిగా సీనియర్ బీజేపీ నాయకుడు, నంగునూరు మండలం మగ్ధుంపూర్ గ్రామానికి చెందిన వాసరి యాదమల్లు నియమితులయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు, బీజేపీ రాష్ట్ర ఇంఛార్జి అభయ్ పాటిల్, బీజేపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి చంద్రశేఖర్, మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన రావులు ఇటీవల బీజేపీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ ముదిరాజ్, జిల్లాలోని ఇతర ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో సిద్ధిపేట జిల్లాలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. బీజేపీ బలోపేతానికి పలు సూచనలు చేశారు. వారి సూచనలు, బీజేపీ జిల్లా నాయకుల అభిప్రాయాల మేరకు బీజేపీ పూర్తి స్థాయి జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ కార్యవర్గంలో నంగునూరు మండలం మగ్ధుంపూర్ గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు వాసరి యాదమల్లు జిల్లా కార్యదర్శిగా నియమితులయ్యారు.
విధేయతకు దక్కిన గుర్తింపు
మగ్ధుంపూర్ గ్రామానికి చెందిన వాసరి యాదమల్లు బీజేపీ అధికారంలో లేనప్పుడు కార్యకర్తగా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. నంగునూరు బీజేపీ నంగునూరు మండల శాఖ అధ్యక్షునిగా పార్టీ ఉనికిని కాపాడారు. బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శిగా సేవలు అందించారు. తమ పార్టీలో చేరితే మంచి అవకాశాలు కల్పిస్తామని వివిధ పార్టీల నేతలు ఆహ్వానించినా తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి బీజేపీని వదిలి పెట్టలేదు. వాసర యాదమల్లు నిబద్ధతను గుర్తించిన అధిష్టానం బీజేపీ జిల్లా కార్యదర్శి పదవికి ఎంపిక చేసింది.
బీజేపీ బలోపేతానికి కృషి
- వాసరి యాదమల్లు, బీజేపీ జిల్లా కార్యదర్శి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి జిల్లాలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని బీజేపీ సిద్ధిపేట జిల్లా కార్యదర్శిగా నియమితులైన వాసరి యాదమల్లు చెప్పారు. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ పాలనతో దేశ భద్రత సురక్షితంగా ఉంటుందని చెప్పారు. తనను జిల్లా కార్యదర్శిగా నియమించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు, మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన రావు, జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ ముదిరాజ్, రాష్ట్ర ఇంఛార్జి అభయ్ పాటిల్, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చొప్పదండి విద్యాసాగర్, ఇందుకు సహకరించిన జిల్లా, మండల బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బీజేపీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు, కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.


















