ప్రతిపక్షం, జూలై 14: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను చంచల్గూడ కేంద్ర కారాగారానికి తరలించారు.
ఇటీవల ఓ టెలివిజన్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం నాగార్జున యాదవ్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
విచారణ అనంతరం నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించగా, అధికారులు చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

















