ప్రతిపక్షం, జూలై 15: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కోసం అమలు చేస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు.
ఉద్యోగుల నుంచి ప్రీమియం వసూలు చేసినప్పటికీ హెల్త్ కార్డులు జారీ చేయకపోవడం, పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు. వెంటనే హెల్త్ కార్డులు జారీ చేసి పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే ఉద్యోగుల నుంచి వసూలు చేసిన 1.5 శాతం ప్రీమియం మొత్తాన్ని అమలు జరగని కాలానికి సంబంధించి వారి ఖాతాల్లో తిరిగి జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, లేనిపక్షంలో ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడుతుందని హరీశ్ రావు హెచ్చరించారు.


















