ప్రతిపక్షం, జూలై 15: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. రాష్ట్రంలో పోక్సో చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేయాలని, చిన్నారులపై లైంగిక నేరాల కేసుల్లో వేగవంతమైన విచారణ జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
పోక్సో కేసుల దర్యాప్తు, విచారణకు నిర్దిష్ట గడువు విధించాలని, బాధితులకు తగిన రక్షణ కల్పించాలని, కీలక సాక్ష్యాధారాలు మాయం కాకుండా పటిష్ఠమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని లేఖలో సూచించారు.
ఇటీవల రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన ఘటనను ప్రస్తావించిన పవన్ కళ్యాణ్.. బాధితులను రక్షించడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. అలాగే, ఆ కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు కావడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ పోక్సో చట్టం అమలును మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
















