ప్రతిపక్షం, జూన్ 02: తెలంగాణలో జనసేన పార్టీకి రాజకీయంగా పెద్దగా అవకాశం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా గౌరవిస్తామని, అయితే తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నాలు సమంజసం కాదని అన్నారు.
పవన్ కళ్యాణ్కు తెలంగాణ రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం ఏమిటని ప్రశ్నించిన ఆయన, రాష్ట్రంలో సభ నిర్వహించాలన్న నిర్ణయం వెనుక రాజకీయ లక్ష్యాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో విద్వేషాలు, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే పరిస్థితులు తలెత్తకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు.
అలాగే, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జనసేన ద్వారా రాజకీయ ప్రయోగం చేయాలని చూస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. రాష్ట్ర ప్రజలు శాంతి, అభివృద్ధిని కోరుకుంటున్నారని, విభజన రాజకీయాలను అంగీకరించరని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రజాస్వామ్య వాతావరణాన్ని కాపాడటమే తమ ప్రాధాన్యత అని, రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

















