ప్రతిపక్షం, జూన్ 02: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణపై తనకున్న అనుబంధాన్ని మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి చెందాలని మాత్రమే తాను కోరుకుంటానని, దాని వెనుక ఎలాంటి ఇతర ఉద్దేశాలు లేవని అన్నారు.
“నాకు హైదరాబాద్లో ఏం పని అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నన్ను బెదిరించే హక్కు ఎవరికీ లేదు. తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు. నాపై దాడులు చేస్తామంటూ హెచ్చరించడం సరికాదు” అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
తనకు తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ బెదిరింపులు ఎదురయ్యాయని పేర్కొంటూ, “దాడి చేయాలనుకుంటే నా ఇంటి చిరునామా అందరికీ తెలుసు. అందుకే ఇంటి వద్దే మీడియా సమావేశం పెట్టాను” అని అన్నారు.
“తెలంగాణ నా గుండెల్లో ఉంది. ఈ రాష్ట్ర ప్రజల పట్ల నాకు గౌరవం, అభిమానమే ఉన్నాయి” అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇటీవల తెలంగాణలో సభ నిర్వహణ అంశంపై నెలకొన్న రాజకీయ వివాదాల నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

















