ప్రతిపక్షం, జూన్ 02: ఎల్బీనగర్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పోరాట కేంద్రంగా గుర్తింపు పొందింది. ఉద్యమ వేడి ఉద్ధృతంగా ఉన్న సమయంలో ఇక్కడ జరిగిన ఆందోళనలు ప్రత్యేక రాష్ట్ర సాధనకు బలమైన ఊతమిచ్చాయి.
ఎల్బీనగర్ చౌరస్తాలో అమరవీరుడు శ్రీకాంతాచారి చేసిన ఆత్మత్యాగం తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. ఆయన త్యాగం ఉద్యమ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచి, వేలాది మంది యువతలో ఉద్యమ చైతన్యాన్ని రగిల్చింది.
అలాగే ఉద్యమకారులు సతీశ్ యాదవ్, యాదగిరి, శ్యాంసుందర్ రెడ్డి తదితర నాయకులు, విద్యార్థి జేఏసీ కార్యకర్తలు సకల జనుల సమ్మె, రాస్తారోకోలు, మిలియన్ మార్చ్ వంటి ఉద్యమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.
ప్రత్యేక తెలంగాణ సాధన కోసం జరిగిన ప్రజాపోరాటాల్లో ఎల్బీనగర్ ప్రాంత ప్రజలు, విద్యార్థులు, ఉద్యమకారులు చూపిన త్యాగాలు, పోరాట స్ఫూర్తి తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఎల్బీనగర్ గడ్డ తెలంగాణ ఆత్మగౌరవ ఉద్యమానికి ప్రతీకగా గుర్తుండిపోతుంది.

















