- విద్యార్థుల సంక్షేమమే తొలి ప్రాధాన్యం
- ఆకస్మిక తనిఖీలతో హాస్టళ్లు, తరగతి గదుల పరిశీలన
- సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాలు
ప్రతిపక్షం స్టేట్ బ్యూరో, ఉత్తర తెలంగాణ హైదరాబాద్, జూలై 16: గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, అక్కడికక్కడే పరిష్కరించే ఉద్దేశంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.గురువారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TGSWREIS) ఆధ్వర్యంలో హైదరాబాద్లోని చైతన్యపురి మహిళా న్యాయ కళాశాల, ఇబ్రహీంపట్నం రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల (RDC), సరూర్నగర్ బాలికల గురుకుల పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థినులతో ముఖాముఖిగా మాట్లాడిన మంత్రి వారి విద్యాభ్యాసం, హాస్టల్ నిర్వహణ, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత, బోధన తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు ప్రధానంగా మూడు విద్యాసంస్థలు ఒకే ప్రాంగణంలో ఉండటం వల్ల తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
విద్యార్థుల సమస్యను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న మంత్రి వెంటనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి, మిషన్ భగీరథ పైప్లైన్ ద్వారా శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు, అప్పటి వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.అనంతరం హాస్టల్ గదులు, డైనింగ్ హాల్, వంటశాల, తరగతి గదులు, గ్రంథాలయం, ప్రయోగశాలలు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య నిర్వహణను మంత్రి స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యత, మెనూ అమలు, పరిశుభ్రత ప్రమాణాలపై ప్రత్యేకంగా ఆరా తీశారు. మెనూ ప్రకారమే రుచికరమైన, నాణ్యమైన భోజనం అందిస్తున్నారని విద్యార్థినులు మంత్రికి తెలిపారు.విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడిన మంత్రి, విద్యాసంస్థల్లో ఏ చిన్న సమస్య ఉన్నా నిర్భయంగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థుల అభిప్రాయాలు, సూచనలు ప్రభుత్వానికి ఎంతో విలువైనవని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన మంత్రి, విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో తమ పిల్లలను గురుకుల విద్యాసంస్థలకు పంపిస్తున్నందున వారి విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల ఉన్నత విద్యాభివృద్ధికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి తెలిపారు. అదే ఆలోచనతో ఆధునిక సౌకర్యాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ గురుకుల విద్యాసంస్థల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారువిద్యార్థుల సంక్షేమం కోసం డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలను గణనీయంగా పెంచి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని గుర్తు చేశారు.విద్య ద్వారానే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చూపిన మార్గంలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గురుకుల విద్యాసంస్థలు సామాజిక మార్పుకు కేంద్రాలుగా నిలవాలి. ప్రతి ఉపాధ్యాయుడు తమ బాధ్యతను సేవాభావంతో నిర్వర్తించి విద్యార్థులను ఉన్నత లక్ష్యాల వైపు నడిపించాలి” అని మంత్రి పేర్కొన్నారు.విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశంపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తుందని, ఆకస్మిక తనిఖీలు కూడా అదే లక్ష్యంతో నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సమస్యలు గుర్తించిన చోట వెంటనే పరిష్కార చర్యలు చేపట్టి, గురుకులాలను దేశంలోనే ఆదర్శ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.ఈ తనిఖీ లో TGSWREIS (FAC) కార్యదర్శి శ్రీమతి కంభంపాటి శారద,స్టేట్ ఆఫీసర్ నిర్మల, ప్రిన్సిపాల్ సరూర్నగర్ గర్ల్స్ స్కూల్ కృష్ణ ప్రభలా , డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.


















