ప్రతిపక్షం, జూన్ 04: ఫ్రాన్స్లో ఈ నెల 15 నుంచి 17 వరకు జరగనున్న జీ-7 సదస్సు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారత్ను భాగస్వామ్య దేశంగా ఫ్రాన్స్ ఆహ్వానించగా, ప్రధాని మోదీ పాల్గొననున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా సదస్సుకు హాజరవుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు దేశాధినేతల సమావేశంపై ఆసక్తి నెలకొంది.
గత కొంతకాలంగా భారత్–అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు, సుంకాల అంశాలు, రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై విభేదాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో మోదీ–ట్రంప్ భేటీ జరిగితే వాణిజ్య సంబంధాలు, పెట్టుబడులు, వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ప్రపంచ వాణిజ్య సవాళ్ల నేపథ్యంలో ఈ సమావేశం ఇరు దేశాల సంబంధాలకు కొత్త దిశను నిర్దేశించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

















