ప్రతిపక్షం, జూన్ 06: వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్ష రద్దు కావడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. లక్షలాది మంది విద్యార్థులు నెలల తరబడి కష్టపడి సిద్ధమైతే, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వారి భవిష్యత్తు అనిశ్చితిలో పడిందన్నారు.
పరీక్ష నిర్వహణలో జరిగిన లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల శ్రమ, వారి కుటుంబాల ఆశలను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు.
నష్టపోయిన విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేసిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపుతోందని కూడా ఆరోపించారు.















