ప్రతిపక్షం, ఆగస్టు 03: ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ జిల్లాలో కుటుంబ విభేదాల నేపథ్యంలో ఓ బాడీ బిల్డర్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. స్థానికంగా జిమ్ నిర్వహిస్తున్న దేవదత్ శర్మ (52) తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆత్మహత్యకు ముందు ఆయన తన మేనకోడలికి వాట్సాప్లో పంపిన చివరి సందేశం కలచివేస్తోంది. కుటుంబంలో ఎదురవుతున్న అవమానాలు, మానసిక వేదనను ఇక భరించలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నానని పేర్కొన్నారు. తాను మరణించిన తర్వాత తన శవాన్ని భార్య తాకకూడదని, అంత్యక్రియలకు అనవసరంగా ఖర్చు చేయవద్దని, తన తల్లిని బాగా చూసుకోవాలని సందేశంలో కోరినట్లు సమాచారం.
దేవదత్ శర్మకు భార్య సీమా రాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సమస్యలే ఈ విషాద ఘటనకు కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
వాట్సాప్ సందేశం, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు దారితీసిన అసలు కారణాలపై విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

















