ప్రతిపక్షం, ఆగస్టు 04: తెలంగాణలో వర్షాలు కొనసాగనున్న నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు ఇవాళ ఉదయం వరకు కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు.
నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, జనగామ, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని, వర్ష సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహనదారులు రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో అప్రమత్తంగా ప్రయాణించాలని, వాతావరణ శాఖ తాజా హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని అధికారులు కోరారు.

















