ప్రతిపక్షం, వికారాబాద్, ఆగస్టు 04: తాండూరు నియోజకవర్గ గడ్డపై టిఆర్ఎస్ జండా ఎగరవేసే దిశగా తాము ముందుకు సాగుతున్నామని టిఆర్ఎస్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ కంచర్ల శివారెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న టిఆర్ఎస్ జండా పండుగ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో జెండా పండుగ వికారాబాద్ ఇంచార్జ్ కోలా శ్రీనివాస్, జుక్కల్ ఇంచార్జ్ రాజశేఖర్, తాండూరు నియోజకవర్గ ఇన్చార్జ్ వీరమణిలతో కలసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి జెండా ఆవిష్కరించారు. అంతకుముందు ఇందిరా చౌక్ లోని బసవేశ్వర , జయశంకర్ విగ్రహాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తాండూరు నియోజకవర్గంలో మొదటి జెండాను ఎగరవేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో గ్రామ గ్రామాన గల్లి గల్లి లో జెండా ఎగురవేసి టిఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో టిఆర్ఎస్ నియోజకవర్గ వ్యాప్తంగా బలమైన కార్యకర్తలను తయారు చేసుకోబోతుందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈనెల 6న హైదరాబాదులో సామాజిక తెలంగాణ న్యాయ సభను నిర్వహించనున్నామన్నారు. పదివేల మందితో టిఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఈ సభ జరగబోతుందన్నారు. తాండూరు నియోజకవర్గంలో అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వచ్చే దిశగా కవితక్క చేస్తున్న కార్యక్రమం చాలా గొప్పదన్నారు. రైల్ రోకో కార్యక్రమాన్ని నిర్వహించి విజయం సాధించిన ఘనత కవితక్కకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


















