ప్రతిపక్షం, ఆగస్టు 05: అమెరికాతో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆంక్షలు, అంతర్గత ఆర్థిక సమస్యల ప్రభావంతో ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. రోజురోజుకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయం కారణంగా సాధారణ ప్రజలు కనీస అవసరాలు తీర్చుకోవడానికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు సాధారణంగా కనిపించిన కుటుంబాలు ఇప్పుడు బతుకుదెరువు కోసం తమ వద్ద ఉన్న వస్తువులనే అమ్ముకునే పరిస్థితికి చేరుకున్నాయి.
డబ్బు కోసం ప్రజలు వాడేసిన పర్ఫ్యూమ్ సీసాలు, సెకండ్హ్యాండ్ దుస్తులు, ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులు విక్రయిస్తున్నారు. కొందరు మహిళలు తమ పొడవాటి జుట్టును కూడా అమ్ముకుంటూ కుటుంబ అవసరాలు తీర్చుకుంటున్నారు. మరికొందరు ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అద్దెకిస్తూ ఆదాయం సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇరాన్లో జులై నెలలో ద్రవ్యోల్బణం 66 శాతానికి చేరుకోవడంతో ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగాయి. సాధారణ కుటుంబాలు రోజువారీ ఖర్చులు భరించలేని పరిస్థితి నెలకొంది. మధ్యతరగతి కుటుంబాలు కూడా అప్పుల పాలవుతూ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
ఆర్థిక పరిస్థితి మరింత దిగజారితే నిరుద్యోగం, పేదరికం, సామాజిక అస్థిరత మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడం, ధరలు అదుపు తప్పడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని వారు విశ్లేషిస్తున్నారు.

















