- పుట్టిన మొదటి గంటలోపు తల్లి పాలు తాగించాలి
- చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సుచిత్ర, డాక్టర్ మనోహర్
- సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిలో తల్లి పాల వారోత్సవాల నిర్వహణ
ప్రతిపక్షం, ఆగస్టు 08, సిద్దిపేట: తల్లి పాలే శిశువుకు మొదటి టీకా అని ప్రభుత్వాసుపత్రి చిన్న పిల్లల విభాగ హెచ్ఓడీ డాక్టర్ సుచిత్ర, చిన్నపిల్లల సీనియర్ వైద్యులు డాక్టర్ టీసీ మనోహర్ తెలిపారు. ప్రపంచ తల్లి పాల ప్రాముఖ్యత వారోత్సవాల్లో భాగంగా సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆసుపత్రిలో వైద్యులు శుక్రవారం అవగహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్బంగా డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ..శిశువు పుట్టిన గంటలోపే తల్లిపాలు ప్రారంభించాలన్నారు. ఆరు నెలల వరకు కేవలం తల్లి పాలను మాత్రమే ఇవ్వాలని సూచించారు. తల్లి పాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారం, రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు మానసిక వృద్దికి దోహదపడుతాయని తెలిపారు. తల్లికి కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయన్నారు. ప్రసవానంతర రక్తస్రావం తగ్గడం, గర్భాశయం త్వరగా సాధారణ స్థితికి రావడం, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం తగ్గడం వంటి ప్రయోజనాలు కలిగిస్తాయన్నారు. తల్లిపాలు పట్టడం వల్ల శిశువును ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్ఎంఓలు డాక్టర్ సదానందం, డాక్టర్ మాధవి, డాక్టర్ శ్రావణి, వైద్యులు మాధవి, రమ్య, రాగిణి, రవి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















