ప్రతిపక్షం, ఆగస్టు 06, హైదరాబాద్: రాష్ట్రంలో 22A నిషేధిత భూముల అంశంపై ఎలాంటి అపోహలకు తావు లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 22A జాబితా కారణంగా అర్హులైన భూ యజమానులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని ఆయన హామీ ఇచ్చారు.
కొత్తగా ఒక్క సెంటు భూమినీ 22A నిషేధిత జాబితాలో చేర్చలేదని మంత్రి వెల్లడించారు. వివాదాలు లేని ప్రైవేట్ భూములను ప్రభుత్వం 22A జాబితాలో చేర్చిందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు.
ప్రభుత్వ భూములను పరిరక్షించడంతో పాటు, అర్హుల హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పొంగులేటి పేర్కొన్నారు. ఈ రెండు అంశాల్లో అధికారులు సమతుల్యంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
22Aకి సంబంధించిన దరఖాస్తులు, ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా నిర్ణీత గడువులోనే పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.
22A భూముల విషయంలో అర్హుల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని ఆయన కోరారు.

















