ప్రతిపక్షం, ఆగస్టు 06: ప్రజాకవి గద్దర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో గద్దర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు.
తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యపరిచిన గద్దర్ సేవలు చిరస్మరణీయమని సీఎం పేర్కొన్నారు. పాటను ప్రజా పోరాటానికి ఆయుధంగా మలిచి అణగారిన వర్గాల గొంతుకగా నిలిచిన మహనీయుడిగా గద్దర్ను గుర్తు చేసుకున్నారు.
ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం గద్దర్ చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమని సీఎం అభిప్రాయపడ్డారు. ఆయన ఆశయాలను స్మరించుకుంటూ ప్రజాసేవకు మరింత కట్టుబడి పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

















