ప్రతిపక్షం, ఆగస్టు 11: హైదరాబాద్లోని గాజులరామారానికి చెందిన ఓ వ్యక్తి సామాజిక మాధ్యమంలో బాలలపై లైంగిక దోపిడీకి సంబంధించిన నిషేధిత కంటెంట్ను వీక్షిస్తూ, ఇతరులకు పంపుతున్నట్లు అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రన్ సంస్థ గుర్తించింది. ఈ విషయాన్ని వెంటనే భారత్లోని జాతీయ నేర గణాంకాల విభాగానికి సమాచారం అందించింది.
అక్కడి నుంచి రాష్ట్ర సైబర్ నేర విభాగానికి సమాచారం చేరడంతో సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడి అంతర్జాల చిరునామాను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిషేధిత బాలల కంటెంట్ను వీక్షించడం, భద్రపరచడం లేదా ఇతరులకు పంపడం చట్టపరంగా తీవ్రమైన నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.





























