ప్రతిపక్షం, ఆగస్టు 14: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరోసారి స్పష్టత ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీని కానీ, పార్టీ నాయకత్వాన్ని కానీ తప్పుపట్టలేదని తెలిపారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన నేతల ఆధిపత్యం పెరగకూడదన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు.
నిజమైన కాంగ్రెస్ నాయకులను అణచివేయకుండా వారికి తగిన గుర్తింపు, ప్రాధాన్యం ఇవ్వాలని రాజగోపాల్రెడ్డి కోరారు. కాంగ్రెస్ కోసం మొదటి నుంచి పనిచేసిన నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
సీమాంధ్ర నేతల ప్రభావం ఉండకూడదు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సీమాంధ్ర నేతల చెప్పుచేతల్లో ఉండకూడదని రాజగోపాల్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగాలని, రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తెలంగాణకు సంబంధించిన నిర్ణయాల్లో స్థానిక నాయకులు, ప్రజల అభిప్రాయాలకు విలువ ఉండాలని పేర్కొన్నారు.
కాంగ్రెస్ను వీడే ప్రసక్తే లేదు
తన వ్యాఖ్యలను కొందరు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చిత్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. తాను కాంగ్రెస్ను విమర్శించలేదని, పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే కొన్ని అంశాలను ప్రస్తావించానని స్పష్టం చేశారు. రాహుల్గాంధీ నాయకత్వంలోనే తాను పనిచేస్తానని రాజగోపాల్రెడ్డి తేల్చిచెప్పారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలని, పేదలు, ఉద్యమకారులు, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం జరిగేలా పాలన సాగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వంలో ఉన్న లోపాలను ప్రస్తావించడం పార్టీని వ్యతిరేకించడం కాదని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం మాట్లాడటమేనని ఆయన స్పష్టం చేశారు.





























